తన లేఖతో సిజెఐని ఆలోచనలో పడేసిన బాలిక.. ఇంతకీ ఆ లేఖలో ఏముందో తెలుసా?

తనకు ఓ బాలిక రాసిన లేఖతో సిజెఐ ఎన్‌వి రమణ ఆలోచనలో పడ్డారు. అంతేకాదు, ఆ బాలిక రాసిన లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా సుప్రీంకోర్టు నమోదు చేసుకుంది. ఇంతకీ ఆ బాలిక రాసిన లేఖలో ఏముందంటే, ప్రస్తుతం అన్నిచోట్లా పాఠశాలలు తెరుచుకున్నాయి. కోర్టులు మాత్రం ఇప్పటికీ వర్చువల్‌ విధానంలోనే నడుస్తున్నాయి. ఈ విషయాన్ని ఆ బాలిక తన లేఖలో ప్రస్తావించింది. స్కూళ్లు తెరుచుకున్నప్పుడు కోర్టులు ఎందుకు తెరుచుకోవు? అంటూ బాలిక ప్రశ్నించింది. సిజెఐని సన్మానించేందుకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ లేఖలోని సారాంశాన్ని వెల్లడించారు. ఈ లేఖను సిజెఐ ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించారని, త్వరలోనే దీనిపై విచారణ జరగనుందని తెలిపారు. కాగా, కరోనా కారణంగా దేశంలోని కోర్టులన్నీ 2020 మార్చి నుంచి వర్చువల్‌ విధానంలో విచారణను కొనసాగిస్తున్నాయి. సుప్రీంకోర్టులో సెప్టెంబరు 1 నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణకు అనుమతించినా.. కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవుతారో, లేక వర్చువల్‌గా వాదనలు వినిపిస్తారో న్యాయవాదులే నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, న్యాయవాదుల్లో అత్యధికులు ఇప్పటికీ వర్చువల్‌ విధానం ద్వారానే వాదనలు వినిపించేందుకే మొగ్గు చూపుతున్నారు.