దేశంలో చాలా ఆక్సిజన్ ఉంది: నవీన్ జిందాల్

ఇండియాలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. గత కొన్ని వారాలుగా వేలల్లో ఉన్న కేసులు లక్షల్లోకి చేరాయి. నిత్యమూ తమకు ఊపిరి అందడం లేదని వేలాది మంది ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. వీరందరికీ అవసరమైన ఆక్సిజన్ సరఫరాలో తీవ్రమైన అవాంతరాలు ఏర్పడ్డాయి. పలు ఆసుపత్రుల్లో ప్రాణవాయువు అందక వందలాది మంది మరణించారు కూడా. ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్రం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని పలు రాష్ట్రాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ఆక్సిజన్ ప్లాంట్లలో ఉత్పత్తిని పెంచాలని కేంద్రం ఆదేశించింది కూడా.

ఈ క్రమంలో దేశంలో ఆక్సిజన్ తయారీలో ముందున్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ చైర్మన్ నవీన్ జిందాల్ స్పందించారు. ఓ జాతీయ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, “ప్రజల ప్రాణాలను కాపాడటం మన విధి. మా ప్లాంటులో తయారైన ఆక్సిజన్ మొత్తాన్ని ఆసుపత్రులకు తరలిస్తున్నాం. ఉక్కు తయారీని పక్కన బెట్టి, వైద్య అవసరాలకు పంపుతున్నాం. నేను ప్రజలకు ఒక్కటే చెప్పాలని అనుకుంటున్నా. దేశంలో ఆక్సిజన్ కొరత లేదు” అని ఆయన అన్నారు.