Tokyo Olympics: హాకీలో ఇండియా బోణీ.. న్యూజిలాండ్‌పై విజయం

టోక్యో: ఊహించినట్లే టాప్ ఫామ్‌లో ఉన్న ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ ఒలింపిక్స్‌లో బోణీ కొట్టింది. పూల్ ఎ లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 3-2తో విజయం సాధించింది. రెండు గోల్స్‌తో హర్మన్‌ప్రీత్ సింగ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొదట న్యూజిలాండ్‌కు కేన్ రసెల్ గోల్ చేసి 1-0 లీడ్ సాధించి పెట్టాడు. అయితే ఆ తర్వాత రూపిందర్ పాల్ సింగ్ గోల్‌తో స్కోరు సమం చేశాడు. ఆ వెంటనే హర్మన్‌ప్రీత్ మరో గోల్ చేసి లీడ్‌ను 2-1కి పెంచాడు. సెకండ్ క్వార్టర్‌లోనూ హర్మన్‌ప్రీత్ మరో గోల్‌తో టీమిండియా లీడ్ 3-1కి పెరిగింది. ఇక మూడో క్వార్టర్ చివరి నిమిషంలో న్యూజిలాండ్ ప్లేయర్ స్టీఫెన్ జెన్నెస్ గోల్‌తో టీమిండియా లీడ్‌ను 2-3కి తగ్గించాడు.

చివరి క్వార్టర్‌లో ఇండియా స్కోరును సమం చేయడానికి న్యూజిలాండ్ ప్రయత్నించినా.. ఇండియన్ ప్లేయర్స్ సమర్థంగా అడ్డుకున్నారు. చివరికి మ్యాచ్ ముగియడానికి 24 సెకన్ల ముందు న్యూజిలాండ్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. ఇలా స్కోరు సమం చేసే అవకాశం వాళ్లకు దక్కినా.. గోల్ కీపర్ శ్రీజేష్ దానిని అడ్డుకున్నాడు. దీంతో ఇండియ్ టీమ్ 3-2తో విజయాన్ని సొంతం చేసుకుంది.