తణుకు చేరిన వారాహి విజయ యాత్ర

• అడుగడుగునా శ్రీ పవన్ కళ్యాణ్ కి అపూర్వ స్వాగతం
జన నీరాజనం మధ్య ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన ఆడపడుచులు హారతులు, జనసైనికుల కేరింతల మధ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు జైత్ర యాత్ర సాగిస్తున్నారు. యాత్రలో భాగంగా గురువారం సాయంత్రం తాడేపల్లిగూడెం నుంచి తణుకు చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. తాడేపల్లిగూడెం పర్యటన ముగించుకుని తణుకు బయలుదేరగా అలంపురం నుంచే పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో అనుసరించాయి. దువ్వ వద్ద తణుకు నియోజకవర్గంలో అడుగు పెట్టిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేలాదిగా ఆడపడుచులు, జనసైనికులు, ప్రజలు జాతీయ రహదారిపైకి వచ్చి పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. బాణా సంచా పేలుళ్లతో ఆ కూడలిలో పండగ వాతావరణం నెలకొంది. జన సైనికుల ద్విచక్ర వాహనాల ర్యాలీతో పైడిపర్రు మీదుగా తణుకు చేరుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాక సందర్భంగా తణుకు నియోజక వర్గం జన సైనికులు, వీర మహిళలు భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కమ్మ కళ్యాణ మండపానికి చేరుకుని జయజయధ్వానాలతో స్వాగతం పలికారు.