మన పార్టీ ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’… అధికారికంగా ప్రకటించిన వైఎస్ షర్మిల

తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్న వైఎస్ షర్మిల ఇవాళ పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొన్నారు. హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఆమె ప్రసంగించారు. జోహార్ వైఎస్సార్, జై తెలంగాణ నినాదాలతో షర్మిల తన ప్రసంగం ప్రారంభించారు. కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన సంక్షేమ సంతకం వైఎస్సార్ అని తెలిపారు. మా నాన్న మాట ఇస్తే బంగారు మూట ఇచ్చినట్టేనని పేర్కొన్నారు. శత్రువులు సైతం ప్రశంసించిన నేత వైఎస్సార్ అని కొనియాడారు.

ఇవాళ ఆయన జయంతి అని, ఇది మనందరికీ పండుగ రోజని తెలిపారు. ఆయన చూపిన బాటలో నడవడానికి, ఈ రోజు ఆయన పుట్టినరోజున మన పార్టీ ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’ని స్థాపిస్తున్నామని షర్మిల ప్రకటన చేశారు. మరోసారి సంక్షేమ రాజ్యం తీసుకువచ్చేందుకు వైఎస్సార్ 72వ జయంతి రోజున ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’ ఏర్పాటు ప్రకటన చేస్తున్నామని వెల్లడించారు.