క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేసుకోండి

* ఫిబ్రవరి 10వ తేదీన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం
జనసేన క్రియాశీలక సభ్యత్వం ద్వారా పార్టీతో అనుబంధం మరింత పెంపొందించుకోవడానికి ఈ నెల 10 నుండి ప్రారంభమయ్యే మూడవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నామని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ జెండా భుజాన మోసే కార్యకర్తల సంకల్పం, పట్టుదలను జనసేన ఏనాడూ విస్మరించదు. గతంలో సభ్యత్వ నమోదు చేసుకున్న వారు రెన్యువల్ చేసుకోవడానికి, కొత్తగా క్రియాశీలక సభ్యత్వం పొందడానికి ఫిబ్రవరి 10 నుండి 28 వరకు అవకాశం ఉంటుంది. జనసేన పార్టీకి కార్యకర్తలే వెన్ను దన్ను, ముఖ్యంగా క్రియాశీలకంగా ఉండే కార్యకర్తల కృషి ఫలితంగానే పార్టీ బలంగా ప్రజల్లోకి వెళ్తుందని విశ్వసిస్తున్నాం. గత రెండు సంవత్సరాలుగా లక్షల సంఖ్యలో జనసేన క్రియాశీలక సభ్యత్వాలు నమోదయ్యాయి. ఈ సంవత్సరం కూడా క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ విజయవంతం చేయాలని జనసేన నాయకులను, వీర మహిళలను, జన సైనికులను కోరుతున్నాం. ముఖ్యంగా ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియలో పార్టీ క్రియాశీలక వాలంటీర్ల కృషి మరువలేనిది. కార్యకర్తలకు భరోసాను కల్పించడం మా బాధ్యత. కార్యకర్తలు, వారి కుటుంబాలకు భరోసా ఇవ్వడం బాధ్యతగా బావించే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రమాద బీమా ప్రీమియం కోసం తమ వ్యక్తిగత సంపాదన నుంచి ప్రతీ సంవత్సరం కోటి రూపాయలు “క్రియాశీలక కార్యకర్తల భరోసా భీమా” కోసం ఇస్తున్నారు. ఇప్పటి వరకూ 265 మంది బాధిత కుటుంబాలకు 5 కోట్ల 40 లక్షల 90 వేల రూపాయలు ప్రమాద భీమా చెల్లించడం జరిగింది. కార్యకర్తలు, వారు కుటుంబాల భద్రత గురించి ఆలోచించి వ్యక్తిగత సంపాదన నుంచి కోట్ల రూపాయలు పార్టీ కార్యకర్తల కోసం వెచ్చించే అధ్యక్షుడిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు తప్ప ప్రపంచంలోనే ఇంకొకరు ఉండరు అనేది వాస్తవం. వినూత్నమైన ఈ భరోసా రాజకీయ పార్టీల్లో అరుదుగా మాత్రమే కనిపిస్తుంది. క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గత రెండు విడతలు విజయవంతంగా చేపట్టిన క్రియాశీలక వాలంటీర్లు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఈ సంవత్సరం కూడా మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నామని నాగబాబు పేర్కొన్నారు.