బ్యాడ్మింటన్ తార పీవీ సింధుకు 2 ఎకరాల భూమి.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు

భారత బ్యాడ్మింటన్ ధృవతార పీవీ సింధుకు ఏపీ సర్కారు గతంలోనే 2 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ భూమికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. విశాఖ రూరల్ మండల్ చినగాదిలి వద్ద 2 ఎకరాల భూమిని పీవీ సింధుకు కేటాయిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ భూమి పశుసంవర్ధక శాఖకు చెందినది కాగా, పీవీ సింధుకు అందించేందుకు వీలుగా, దాన్ని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖకు బదలాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు.

తనకు భూమిని కేటాయిస్తే బ్యాడ్మింటన్ కోచింగ్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ నెలకొల్పుతానని పీవీ సింధు గతంలో ఆసక్తి తెలిపింది. పీవీ సింధు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ రంగంలో సాధించిన ఘనతలకు గుర్తింపుగా ఏపీ సర్కారు… విశాఖలోని చిన గాదిలి వద్ద స్థలాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించింది.

ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖను ప్రకటించిన నేపథ్యంలో, క్రీడల హబ్ గానూ ఈ తూర్పుతీర నగరాన్ని అభివృద్ధి చేయాలని సర్కారు భావిస్తోంది. ఈ క్రమంలోనే సింధుకు వైజాగ్ వద్ద స్థలాన్ని కేటాయించినట్టు తెలుస్తోంది.