విద్యార్థులకు రోజుకు 2 జీబీ డాటా ఫ్రీ

కొవిడ్‌-19 మూలంగా ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే కళాశాల విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రోజుకు 2జీబీ చొప్పున ఉచిత డేటా అందించనున్నట్లు ప్రకటించింది. జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు ‘ఉచిత’ సదుపాయం వర్తిస్తుందని సీఎం పళని స్వామి ప్రకటించారు.

ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలల్లో చదువుతున్న 9.69 లక్షల మంది విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ తమిళనాడు ద్వారా దీన్ని అమలు చేయనున్నట్లు పళనిస్వామి ప్రకటించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే ‘ఉచిత’ హామీలు ఊపందుకున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల విద్యా రుణాలను మాఫీ చేస్తామని డీఎంకే అధినేత స్టాలిన్‌ ప్రకటించారు. అక్కడకు కొద్దిరోజులకే యువ ఓటర్లను ఆకర్షించే లక్ష్యంగా పళనిస్వామి ఫ్రీ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తుండడం గమనార్హం.