ఏపీలో బ్లాక్ ఫంగస్ టెన్షన్.. మార్కాపురంలో 6 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

కరోనా సెకండ్ వేవ్ చేస్తోన్న డ్యామేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజూ ఎన్నో విషాద వ్యధలు కళ్లారా చూస్తున్నాం. తమ వారిని కాపాడుకోడానికి అయినవాళ్లు పడే తాపత్రయం.. వ్యాధి నుంచి బయటపడేందుకు రోగుల చేస్తున్న పోరాటం అంతా, ఇంతా కాదు. కాగా ఇప్పుడు కరోనాకు తోడు, కొత్తగా బ్లాక్ ఫంగస్ కూడా మనుషులపై దండెత్తి. ప్రాణాలను హరిస్తుంది. ఫస్ట్ వేవ్ సమయంలో అరుదుగా కనిపించిన ఈ కేసులు.. ఇప్పుడు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ సంఖ్యలో వెలుగుచూస్తున్నాయి. కరోనా వచ్చినవాళ్లు స్టెరాయిడ్స్ అధికంగా వాడటమే ఈ ఫంగస్ కు కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు టెన్షన్ పెడుతున్నాయి.

పట్టణంలో ఆరు బ్లాక్‌ఫంగస్‌ కేసులు వెలుగుచూసినట్లు మార్కాపురం కొవిడ్ సెంటర్ ఇన్‌ఛార్జి డాక్టర్ రాంబాబు తెలిపారు. వారిలో ముగ్గురు నంద్యాలలో చికిత్స పొందుతుండగా.. మరో ముగ్గురు ఇళ్లలోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని వివరించారు. బ్లాక్‌ఫంగస్‌కు ఇప్పటికే రూ.లక్షకు పైగా ఖర్చు చేశామన్న ఓ బాధితుడు.. కంటి ఆపరేషన్ కు రూ.10లక్షలు అవుతాయని డాక్టర్లు చెప్పారన్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగించే తన వద్ద అంత డబ్బు లేదని, గవర్నమెంట్ సాయం చేయాలని కోరుతున్నాడు.