దేశవ్యాప్తంగా 6లక్షల కేసులు, కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను మరింత పెంచాలి

దేశంలో కరోనా పరిస్థితులు, అన్‌లాక్‌ అమలుపై నేడు ముఖ్యమంత్రులతో. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన సమీక్షా సమావేశంలో మోదీ మాట్లాడుతూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6లక్షల క్రియాశీల కేసులున్నాయని దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్‌ కేసుల్లో దాదాపు 80శాతం పది రాష్ట్రాల్లోనే ఉన్నాయని ప్రధాని తెలిపారు. ఈ సమయంలో పది రాష్ట్రాలు వైరస్‌ను కట్టడి చేయగలిగితే కరోనా పోరులో భారత్‌ విజయం సాధించినట్లేనని పునరుద్ఘాటించారు. అందుకే ఈ రాష్ట్రాల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను మరింత పెంచాలని సూచించారు. ముఖ్యంగా బిహార్‌, గుజరాత్‌, యూపీ, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ ల లో కొవిడ్‌ టెస్టుల సంఖ్య తక్కువగా ఉందని, పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నట్లు ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్రాల్లో టెస్టులసంఖ్య భారీగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

వైరస్‌ సోకిన వ్యక్తిని 72గంటల్లోగా గుర్తించి పరీక్షిస్తే వైరస్‌ వ్యాప్తిని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. అందుకే వైరస్‌ నిర్దారణ అయిన వ్యక్తిని కలిసిన వారు కూడా 72గంటల్లోపే పరీక్షలు చేయించుకోవాలని ప్రధాని సూచించారు. వైరస్‌ను కట్టడిచేయడం, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, పర్యవేక్షణలే వైరస్‌ పోరులో కీలక ఆయుధాలని ప్రధాని మరోసారి నొక్కిచెప్పారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు పెరగిందని మరణాల రేటు తగ్గుతున్నాయని మోదీ అన్నారు.

లాక్‌డౌన్‌ తరువాత పరిస్థితులు, అన్‌లాక్‌-3 అమలు జరుగుతున్న విదానాన్ని పది రాష్ట్రాల సిఎంలను ప్రధాని అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంలో వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రులు ప్రధానికి వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు.