భక్తులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఆన్‌లైన్‌ వ్రతాలు

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం అధికారులు భక్తులకు శుభవార్త చెప్పారు. సత్యదేవుడి సన్నిధికి విచ్చేసి వ్రతం ఆచరించుకోలేని భక్తులకోసం అన్నవరం దేవస్థానం నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ వ్రతాల ప్రక్రియ నేటి నుంచి మొదలు కాబోతుంది. ఇందుకోసం ట్రయిల్‌రన్‌ కూడా విజయవంతంగా నిర్వహించారు. ఇక ఈ వ్రతం లో పాల్గొనడానికి ఆన్లైన్లో భక్తులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.  వ్రతం చేయించుకోవాలనుకున్న భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా దేవస్థానానికి రూ.1,116 రుసుం చెల్లించాలి. భక్తులు సూచించిన తేదీన.. పూజ ప్రారంభమయ్యే ముందు యూట్యూబ్‌ లింక్‌ పంపిస్తారు. దీని ద్వారా పురోహితులు చేసే పూజకు అనుగుణంగా ఇంట్లో స్వామివారి వ్రతం చేసుకునే అవకాశంతో పాటు ఆన్లైన్ ద్వారా దేవస్థానంలో జరిగే పూజను లైవ్ లో చూసే వీలుంది. కరోనా నేపథ్యంలో ఆలయ అధికారులు ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. భక్తులు ఎస్‌బీఐ ఖాతా నంబరు 37460007010, ఐఎఫ్‌ఎస్‌సీ: ఎస్‌బీఐఎన్‌0021804 ద్వారా రుసుం చెల్లించాలని అధికారులు సూచించారు. ఇలా చెల్లించిన వివరాలను, భక్తుల గోత్రనామం, చిరునామా, పోన్ నంబరును 9491249990కు వాట్సాప్‌ ద్వారా పంపాలి. అప్పుడు వారు మీరు సూచించిన తేదీన పూజకు ఏర్పాట్లు చేసి యూట్యూబ్ లింక్ పంపుతారు..