ఏలూరులో వింత వ్యాధి..

ఏలూరులో వింత వ్యాధి కేసులు గంట గంటకూ పెరుగుతున్నాయి. ఉన్నవారు ఉన్నట్లే కిందపడిపోయారు. నోట్లో నురగలు కక్కుతూ స్పృహ కోల్పోయారు. చిన్నపిల్లలతో సహా సమారు వంద మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. చూస్తుండగానే కళ్లు తిరిగిపడిపోతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 40 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి 20 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. బాధితులకు రక్త పరీక్షలు, సిటీ స్కానింగ్ పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించడంలేదు. మంచినీరు, వాయు కాలుష్యం కారణం కావచ్చునని వైద్యుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంచినీరు కాచి తాగాలని, అవసరమైతే బయటకు రావాలంటూ వైద్యుల సూచిస్తున్నారు. పరిస్థితిని మంత్రి ఆళ్ళ నాని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కలెక్టర్ ముత్యాలరాజు ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. నెం.. 9154592617.

ఇంటి ముందు వాకిట్లో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలిక అకస్మాత్తుగా నేలపై పడి నోటి వెంబడి నురుగులు కక్కుతూ మూర్చ వచ్చి కొట్టుకులాడి స్పృహ కోల్పోయింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయి ఆ బిడ్డను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సెలైన్లు, ఇంజక్షన్లు ఇవ్వగా కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చింది. మరో ఘటనలో రోడ్డుపై నడుస్తున్న 18 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా కిందపడిపోయి ఫిట్స్‌తో కొట్టుకులాడుతూ స్పృహ కోల్పోయాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన కొందరు యువకుడి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెనువెంటనే ఆ యువకుడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఈలోపే సాధారణ స్థితికి చేరుకున్నాడు.

అయితే గాలి కాలుష్యమా, నీటి కాలుష్యమా, దోమల వలన వచ్చిందా అనేది అంతుచిక్కలేదు. ఆసుపత్రి చీఫ్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ పోతుమూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు వైద్య సేవలు అందిస్తున్నాయి.