బోధికొండ ఘటనపై స్పందించిన పవన్ కల్యాణ్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా హిందూ దేవతా విగ్రహాలపై జరుగుతున్న దాడులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మీడియాకు పలు విషయాలను తెలియజేశారు. శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థం క్షేత్రంలోని బోధికొండపై శ్రీ కొదండ రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విధానం, స్వామి శిరస్సు కనిపించకుండా పోవడం తెలుసుకుంటే చాలా బాధ కలిగిందన్నారు. మన రాష్ట్రంలో గత ఏడాది కాలంగా హిందూ దేవతా విగ్రహాలపై కొంతమంది దుర్మార్గులు దాడులు చేస్తున్నారు.
పిఠాపురం, కొండ బిట్రగుంట, అంతర్వేది ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆరోపించారు. ఇప్పటి వరకు అంతర్వేది ఘటనపై నిందితుల్ని గుర్తించలేకపోయిందని మండిపడ్డారు. రామజన్మభూమి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం సాగుతుంటే మన రాష్ట్రంలో ఉన్న ఆలయాల్లో రాములవారి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆయనకు ఏ మతం ఉన్నా పరమతాలను గౌరవించాలన్నారు. హిందూ ఆలయాలపై ఒక పథకం ప్రకారమే దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గత ఏడాదిగా జరుగుతున్న ఘటనలపై కేంద్ర హోం శాఖ దృష్టి సారించాలని, సీబీఐ అధికారులతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.