భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసముంటున్న పేదలకు యాజమాన్య హక్కులు కల్పించే అంశానికి శాశ్వత పరిష్కారం చూపే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఇలాంటి వారిలో ఇప్పటికే కొందరికి 58, 59 జీవోల ద్వారా యాజమాన్య హక్కులు కల్పించామన్నారు. ఇంకా కొంత మందికి ఈ సమస్య అపరిష్కృతంగా ఉందని, దీనిని శాశ్వతంగా పరిష్కరించేందుకు త్వరలో ఓ ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

రెవెన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష..

కొత్త రెవెన్యూ విధానం నేపథ్యంలో భవిష్యత్తులో జరిగే ఆస్తుల క్రయవిక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చూస్తామని.. ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసముంటున్న పేదలకు యాజమాన్య హక్కులు కల్పించే అంశానికి శాశ్వత పరిష్కారం చూపే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు, వారికి ఇప్పటికే 58, 59 జీవోల ద్వారా జీవోల ద్వారా యాజమాన్య హక్కులు కల్పించామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ నేపథ్యంలో జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ సంబంధిత సమస్యలపై చర్చించారు. వ్యవసాయేతర ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజలు పాల్గొనేలా సమాయత్తం చేయాలని నేతలకు కేటీఆర్‌ సూచించారు. రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమిని రికార్డులకు ఎక్కించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. వ్యవసాయేతర ఆస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించాలని మంత్రులు, ఎమ్మెల్యేలను కేటీఆర్‌ కోరారు. పట్టణాల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన భూ సంబంధిత సమస్యలను సేకరించి ఇవ్వాలని వారికి సూచించారు. ఆయా కాలనీల్లోని భూ సంబంధిత సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల సంఖ్య.. వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలను నివేదించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. సమస్యలన్నింటినీ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించేలా నిర్ణయం తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.