రాజకీయ లబ్ధి కోసం కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు సీఎం జగన్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి

”కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పథకాల ద్వారా జగన్‌ ప్రభుత్వం లబ్ధిపొందుతోంది. అయినప్పటికీ సీఎం జగన్‌రెడ్డి తన రాజకీయ లబ్ధికోసం కేంద్రాన్ని బలిపశువు చేయడానికి చూస్తున్నారు. కేంద్రంపై తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. అందుకు సీఎం జగన్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి” అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. సోమవారం ఇక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు.

”ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను ఎత్తిచూపిన నేరానికి నాపై గతంలో రాజద్రోహం కేసు పెట్టి హింసించలేదా? ఇపుడు జగన్‌ ప్రభుత్వం కూడా అదేపని చేస్తున్నప్పుడు రాజద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదు? అని ప్రశ్నించారు. పెట్రోల్‌, డీజిల్‌పై రోడ్ల అభివృద్ధి పేరుతో సెస్‌ వసూలు చేసిన్నా వాటి కోసం ఒక్క పైసా కూడ ఖర్చుచేయడం లేదని ఆరోపించారు.

విద్యుత్‌ కొనుగోలులో అనేక అక్రమాలు జరుగుతున్నాయంటూ వివరణాత్మక ఆరోపణలు చేశారు. కేవలం 48 గంటల వ్యవధిలో చేసుకున్న ఒప్పందం వెనుక చక్రం తిప్పిన వ్యక్తి ఎవరని నిదీశారు. అమరావతి రైతులకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. రైతుల పాదయాత్రను అడ్డుకోడానికి పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించడం విచారకరమన్నారు. తన కుటుంబ సభ్యులను కిడ్నాప్‌ చేయడానికి కడపకు చెందిన శేఖర్‌రెడ్డి అనే రౌడీ ప్రయత్నించారని, దీనిపై ప్రధానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.