ఒలింపిక్స్లో 4వ స్థానంలో నిలిచిన మొట్ట‌మొద‌టి భార‌త గోల్ఫ‌ర్‌గా అదితి..

టోక్యో ఒలింపిక్స్‌లో స‌త్తా చాటి అంద‌రి దృష్టినీ త‌న వైపున‌కు తిప్పుకున్న‌ భార‌త గోల్ఫ్ క్రీడాకారిణి అదితి అశోక్ (23) స్వ‌ల్ప తేడాతో ఓట‌మి పాలైంది. దీంతో టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు త్రుటిలో పతకం చేజారింది. గోల్ఫ్ వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో ఓడిన‌ప్ప‌టికీ ఆమె 4వ స్థానంలో నిలిచింది. 72 హోల్స్ నిర్వ‌హించే స‌మ‌యానికి ఆమె నాలుగో స్థానంలో నిలిచిన‌ట్లు క్రీడా నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు.

ఇక తొలి స్థానంలో నిలిచిన‌ అమెరికా గోల్ఫర్ నెల్లీ కొర్డా స్వర్ణ ప‌త‌కం అందుకుంది. రెండో స్థానంలో జ‌పాన్, న్యూజిలాండ్‌కు చెందిన మ‌హిళా గోల్ఫ‌ర్‌లు సంయుక్తంగా నిలిచారు. కాగా, ఒలింపిక్స్ లో 4వ స్థానంలో నిలిచిన మొట్ట‌మొద‌టి భార‌త గోల్ఫ‌ర్‌గా అదితి నిలిచింది.

ఓడిపోయిన‌ప్ప‌టికీ అద్భుత ప్రదర్శనతో భార‌త్ నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటోంది అదితి. ఒలింపిక్స్ లో అదితి ప్రదర్శనతో భారత్ లో గోల్ఫ్ కు ఆదరణ పెరుగుతుందని భావిస్తున్నారు.

ఆమె ఆడిన తీరుపై రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. అదితి అశోక్ అద్భుత ప్రదర్శన ఇచ్చిందని అన్నారు. భారతావ‌ని మ‌రో ముద్దుబిడ్డ తనదైన‌ ముద్రను వేసిందని ప్ర‌శంసించారు. ఈ రోజు ఆమె చారిత్రక ప్రదర్శనతో భారత గోల్ఫ్ ఆట‌ను ఉన్న‌త‌ స్థాయికి తీసుకెళ్లింద‌ని చెప్పారు. ఆమె చాలా ప్రశాంతంగా, నిలకడగా ఆడిందని, ఆమె నైపుణ్యం, శ్రమకు అభినందనలు తెలుపుతున్నాన‌ని రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.