ఎయిమ్స్ నర్సుల సమ్మె

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) నర్సులు నిరవధిక సమ్మెకు దిగనున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 10 వేల మందికిపైగా సిబ్బంది.. నిరసనబాట పట్టనున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. నర్సుల హామీలను నెరవేరుస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ గతంలో మాటిచ్చినా.. ఇంతవరకూ వాటిని నెరవేర్చలేదని, తమ ప్రాణాలను పణంగా పెట్టి వైరస్ బాధితులకు సేవ చేస్తుంటే.. కేంద్రం మాత్రం తమపట్ల నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మా సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ హామీ ఇచ్చి ఏడాది కావస్తున్నా.. ఇంతవరకు ఎలాంటి స్పందనా లేదు. అందుకే మేం నిరవధిక సమ్మె చేపట్టబోతున్నాం. తొలుత ఢిల్లీ ఎయిమ్స్ నర్సులతో సమ్మె ప్రారంభమవుతుంది. అనంతరం.. దేశవ్యాప్త నర్సులంతా ఏకమై సమ్మెను ఉద్ధృతం చేయనున్నామని ఎయిమ్స్ నర్సు యూనియన్ అధ్యక్షులు హరీశ్ కుమార్ కజ్లా తెలిపారు.