వీరఘట్టం మండల కేంద్రంలో ఆల్ పార్టీ సమావేశం

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరుపున జనసేన క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స పుండరీకం పాల్గొన్నారు. ఈ సమావేశంలో మత్స పుండరీకం మాట్లాడుతూ ముఖ్యంగా వీరఘట్టం మండల కేంద్రానికి చెందిన 250, 251, 252 పోలింగ్ కేంద్రాలు ఓటర్లు ఓటు వేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. పోలింగ్ కేంద్రం లోపలకి వెళ్లి, వచ్చేందుకు ఒకే ద్వారం ఉండడం, ఇరుకైన గదులవల్ల ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఇళ్ల మధ్యలో పోలింగ్ కేంద్రాలు ఉండడం వలన ఎలక్షన్ జరిగే రోజు 144 సెక్షన్ ఉండడం వలన కూడా పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీరఘట్టం మండలం కేంద్రానికి చెందిన పోలింగ్ కేంద్రాలు అన్ని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఒకే చోట ఉండేవిధంగా చూడాలని కోరారు. అదేవిధంగా మండలంలో గిరిజన ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చేవిధంగా ఉచిత రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. చాలా గ్రామాలలో ఓట్లు తొలిగింపు చేయాలని పలుమార్లు దరఖాస్తులు ఇచ్చినా తిరిగి ఆ ఓట్లు యధావిధిగా ఉంటున్నాయి. దీనివలన స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ బీసీ, ఎస్పీ, ఎస్టీలకు రావాలి. అవి తారుమారు అవుతున్నాయి. అదేవిధంగా ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు అన్ని ఒకే వార్డులో ఉండే విధంగా చూడాలని కోరారు. పోలింగ్ కేంద్రం లోని సీలింగ్ ఫ్యాన్ లు తొలిగించాలని వాటి స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మత్స పుండరీకం కోరారు.