వైసిపి పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా సిద్ధం

ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను నమ్మించి మోసగించడంలో సిద్దహస్తుడనే విషయం ప్రజలంతా గ్రహించారని, జరగబోయే ఎన్నికల్లో వైసిపిని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు అన్నారు. చిట్టమూరు మండలంలోని ఆర్వపాలెంలో ఎన్డీఏ అభ్యర్థుల విజయం కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికీ కరపత్రాలను పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దిక్కు లేదని, కొత్తగా హామీలు ఇవ్వడం సిగ్గు చేటన్నారు. వైసిపి పాలనలో అభివృద్ధి శూన్యమని రాష్ట్రం సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి అవసరం ఎంతైనా ఉందన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ రావుకు కమలం గుర్తుపై, గూడూరు నియోజకవర్గ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ కు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ, కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు దువ్వూరు శరత్ చంద్ర రెడ్డి, జనసేన నాయకులు క్రాంతి, అక్బర్, వేణు, పవన్, గోపాల్, రాము యుగంధర్ రెడ్డి, మునిబాబు తదితరులు పాల్గొన్నారు.