కేబుల్‌ వంతెనపై అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ షో

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ జన్మదిన వేడుకలో భాగంగా మాదాపూర్‌లోని కేబుల్‌ వంతెనపై లేజర్‌ అండ్‌ లైట్‌ షోలో ఆయన ఫొటోలను ప్రదర్శించారు. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు అల్లు అర్జున్‌ పలు సందర్భాల్లో పాల్గొన్న, ‘పుష్ప’ సినిమాకు సంబంధించిన ఫొటోలు ప్రదర్శించారు. నగరంలో కేబుల్‌ వంతెనపై లేజర్‌ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్వాతంత్య్ర, గణతంత్ర, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ఆయా థీమ్‌లను ప్రదర్శిస్తున్నారు.

వంతెన ప్రారంభోత్సవం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలతోపాటు ప్రసిద్ధ కవి కాళోజి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తదితరుల చిత్రాలు ప్రదర్శించారు. మొదటిసారి ఓ సినీ హిరో జన్మదినం సందర్భంగా లేజర్‌ షో ఏర్పాటు చేశారు. ఇందుకోసం చిత్ర నిర్మాణ సంస్థ రూ.30 వేలు జీహెచ్‌ఎంసీకి చెల్లించినట్టు తెలిసింది. అక్కడి వస్తువులు పాడు చేయకుండా ప్రదర్శన ఏర్పాటు చేయాలనే షరతుతోపాటు డ్యామేజీ రికవరీ కోసం రూ.40 వేలు డిపాజిట్‌ చేశారు.