ఏపీ ప‌రిధి జ‌ల విద్యుత్ కేంద్రాలు కేఆర్ఎంబీకి అప్ప‌గింత‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పరిధిలోని జల విద్యుత్ కేంద్రాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం కుడిగట్టున ఉన్న పవర్ హౌస్‌, నాగార్జున‌ సాగర్ కుడి కాల్వపై ఉన్న విద్యుత్ కేంద్రాన్ని అప్పగిస్తూ  ఈ ఉత్తర్వులు వెలువ‌డ్డాయి.  

పవర్ ప్రాజెక్టుల్లోని భవనాలతో పాటు, ఇత‌ర‌ కట్టడాలు, యంత్ర సామగ్రి అంతా కేఆర్ఎంబీకి అప్పగిస్తున్న‌ట్లు వివ‌రించింది. అయితే, తెలంగాణ అప్పగించాకే తమ పవర్ హౌస్‌లను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ స్ప‌ష్టం చేసింది.  

కృష్ణా నదిపై నిర్మించిన జంట జలాశయాలు శ్రీశైలం, నాగార్జున సాగర్‌లను విద్యుత్ కేంద్రాలతో పాటు తన స్వాధీనంలోకి తీసుకోవాలని కేఆర్‌ఎంబీ ఇటీవ‌లే తీర్మానించిన విష‌యం తెలిసిందే. గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ, ఏపీ నిర్మించిన ప్రాజెక్టులను స్వాధీనం చేసుకునేలా కేంద్ర జలశక్తి శాఖ ఇప్ప‌టికే జారీ చేసిన గెజిట్‌ అమలు కోసం ఇటీవ‌లే స‌మావేశం కూడా జ‌రిగింది.