మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు నూతన ఇంఛార్జుల నియామకం

మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జిలను నియమిస్తూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గానికి శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజానగరం నియోజకవర్గానికి బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు నియోజకవర్గానికి టి.వి.రామారావులను నియమించారు. టి.వి.రామారావు గతంలో కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగానూ పని చేశారు. ఈ ముగ్గురికీ పవన్ కళ్యాణ్ ఆదివారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నియామక పత్రాలను అందజేశారు.

అదే విధంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి(కార్యక్రమాల నిర్వహణ కమిటీ)గా ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ను నియమిస్తూ నియామక పత్రం అందచేశారు. నూతనంగా నియమితులైన వారికి పవన్ కళ్యాణ్ గారు అభినందనలు  తెలిపారు. ప్రజలకు అవిరళమైన సేవలు అందించాలని, పార్టీ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. ఇప్పటి వరకు రాజానగరం ఇంఛార్జి బాధ్యతలు నిర్వర్తించిన మేడా గురుదత్, పిఠాపురం ఇంఛార్జి బాధ్యతలు నిర్వర్తించిన శ్రీమతి మాకినీడు శేషుకుమారిలకు పార్టీలో మరో ముఖ్య పదవి అప్పగిస్తామని, వారి సేవలు పూర్తి స్థాయిలో పార్టీకి వినియోగించుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు.