ఎంసెట్‌ నిర్వహణకుఏర్పాట్లు.. విద్యార్థులు పాటించాల్సిన జాగ్రత్తలు

ఈ నెల 9వ తేదీ నుంచి ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ పరీక్ష ప్రారంభం కాబోతుంది. కవిడ్-19 నేపథ్యంలో తగిన నిర్వహణా ఏర్పాట్లకు ఎంసెట్‌ కమిటీ సిద్దమవుమవుతోంది. సెప్టెంబర్‌ 9, 10, 11, 14 తేదీల్లో ఈ పరీక్షల నిర్వహణకు 102 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా లక్షణాలు లేని విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేలా చర్యలు చేపట్టింది. థర్మల్‌ స్క్రీనింగ్‌ ద్వారా వారిని గుర్తించాలని నిర్ణయించింది. కరోనా సంబంధ లక్షణాలున్న వారిని వెనక్కి పంపించి వేయాలని భావిస్తోంది. వీలైతే ఆ సెషన్‌లో ప్రత్యేక గదుల్లో పరీక్షలు రాయించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. పరీక్ష కేంద్రంలో ఉన్న వసతులను బట్టి దీనిపై నిర్ణయం తీసుకోనుంది. లేదంటే వారికి తదుపరి సెషన్లలో పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అలాంటి విద్యార్థులు ఎంసెట్‌ కమిటీ హెల్ప్‌డెస్క్‌కు తెలియజేసేలా చర్యలు చేపడుతోంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమకు దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస సంబంధ సమస్యలు లేవని సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇచ్చేలా విద్యార్థుల హాల్‌టికెట్లలోని నిబంధనల్లో పొందు పరిచింది. విద్యార్థులు మాస్క్‌లు తెచ్చుకోవాలని, 50ఎంఎల్‌ శానిటైజర్‌ బాటిల్‌తోపాటు వాటర్‌ బాటిల్‌ను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొంది. కరోనా కారణంగా ఈసారి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు బయో మెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలు చేయడం లేదు. వేలి ముద్రలు తీసుకోవడం వల్ల కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉన్నందున ఫేస్‌ రికగ్నేషన్‌‌ సిస్టం విధానాన్ని ఫాలో కానుంది. ఇక ఈ పరీక్ష ఫలితాలను అక్టోబర్‌ మొదటి వారంలో విడుదల చేసే అవకాశాలున్నాయి.

ఆన్‌లైన్‌లో ఈ పరీక్షను నాలుగు రోజులపాటు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షల నిర్వహణ ఉంటుంది.

ప్రతి సెషన్‌లో విద్యార్థులను గంటర్నర ముందు నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు.

ఉదయం 7:30 నుంచి, మధ్యాహ్నం 1:30 గంటల నుంచి అనుమతించనున్నారు.

విద్యార్థులు వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

పరీక్ష ప్రారంభ సమయం కంటే నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్షకు వచ్చే విద్యార్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతోపాటు హాల్‌టికెట్, ఆధార్‌ వంటి ఏదేని ఒరిజినల్‌ ఐడీ కార్డు వెంట తెచ్చుకోవాలి.

 హాల్‌టికెట్‌తోపాటు టెస్టు సెంటర్‌ రూట్‌మ్యాప్‌ ఇస్తున్నందున విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రం చూసుకోవాలి.

విద్యార్థులు ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన దరఖాస్తు ఫారంపై గెజిటెడ్‌ అధికారి/కాలేజీ ప్రిన్సిపాల్‌ సంతకం చేయించి, విద్యార్థులు తమ ఎడమచేతి వేలిముద్ర వేసి ఇన్విజిలేటర్‌కు అందజేయాలని నిబంధనల్లో పేర్కొంది.

అలా చేయకపోతే ఆ విద్యార్థి ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెడతామని వెల్లడించింది. రఫ్‌ వర్క్‌ కోసం వినియోగించిన బుక్‌లెట్‌ను ఇన్విజిలేటర్‌కు తిరిగి ఇచ్చివేయాలని పేర్కొంది.