జూనియర్ డాక్టర్ పై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలి: గురాన అయ్యలు

విజయనగరం, జిల్లా సర్వజన ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ పై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జనసేన నేత గురాన అయ్యలు డిమాండ్ చేశారు. ఆసుపత్రి వద్ద నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లకి సంఘీబావం తెలియజేశారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ శిక్షణలో ఉన్న హౌస్ సర్జన్ డాక్టర్ పి.సువర్ణ రాజు సోమవారం రాత్రి ఆసుపత్రిలో రోగులకు చికిత్స చేస్తున్న సమయంలో ఓ రోగికి సంబంధించిన సహాయకుడు డాక్టర్ రాజుపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ దాడిలో డాక్టర్ రాజు కంటిపై గాయమైందన్నారు. అధికార పార్టీ అండదండలతోనే ఆకతాయిలు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. వారి ఆగడాలతో సామాన్య ప్రజలు అవస్థలు పడతున్నారన్నారు. దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు హుసేన్ ఖాన్, రవితేజ, అడబాల వేంకటేష్, పృథ్వీ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.