స్వదేశానికి చేరుకున్న ఆసీస్ క్రికెటర్లు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన ఆస్ట్రేలియా క్రికెటర్లు సురక్షితంగా తమ దేశానికి చేరుకున్నారు. భారత్‌లో కరోనా ఉదృతి నేపథ్యంలో ఐపీఎల్‌ను అర్ధాంతరంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్‌లో ఆడేందుకు వచ్చిన ఆసీస్ క్రికెటర్లు .. రెండు వారాల పాటు మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడ నుంచి ఓ ప్రత్యేక విమానంలో ఇవాళ ఉదయం సిడ్నీ చేరుకున్నారు. సుమారు 40 మంది ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహించారు. స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్‌, ప్యాట్ కమ్మిన్స్‌, స్టీవ్ స్మిత్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్ తో పాటు సపోర్ట్ స్టాఫ్‌, రికీ పాంటింగ్‌, మైఖేల్ స్లేటర్లు కూడా ఇవాళ సిడ్నీ చేరుకున్నట్లు స్థానిక మీడియా చెప్పింది. అయితే కోవిడ్‌తో బాధపడుతున్న మైఖేల్ హస్సే ఇంకా చెన్నైలోనే చికిత్స పొందుతున్నాడు. మే ఆరవ తేదీన ఆసీస్ క్రికెటర్లు మాల్దీవులకు వెళ్లిన విషయం తెలిసిందే.