తిరుపతి ఉప ఎన్నిక కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ-జనసేన

ఈ నెల 17న తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. బీజేపీ-జనసేన తరఫున మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పోటీ చేస్తున్నారు. ఇతర పార్టీలకు దీటుగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. “వెంకటేశ్వరస్వామికి ఫ్యాను కావాలా? వెంకటేశ్వరస్వామికి సైకిల్ కావాలా? వెంకటేశ్వరస్వామికి కావల్సింది కమలం (పద్మావతి అమ్మవారు)” అంటూ తమదైన రీతిలో ప్రచారం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, బీజేపీ-జనసేన కూటమి ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది. బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.

బీజేపీ-జనసేన మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి…

ధర్మాచార్యుల పర్యవేక్షణలోకి టీటీడీ

సాధికారత గల బోర్డు పరిధిలోకి దేవాలయాలు

తిరుమలలో అన్యమత ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు కార్యాచరణ

ప్రతి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు… రూ.2 లక్షల వరకు రుణ సౌకర్యం

పాడి, గొర్రెల రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు

ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా కోసం జలమే జీవనం పథకం

తిరుపతిలో యాదవ కులానికి చెందిన శరభయ్య విగ్రహం ఏర్పాటు

తిరుపతి లోక్ సభ స్థానం పరిధిలో కొత్త బోధనాసుపత్రి స్థాపన

తిరుపతిలో మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు

రూ.48 కోట్లతో భక్త కన్నప్ప పేరిట ప్రత్యేక పాఠశాలలు

పులికాట్ సరస్సులో పూడికతీత పనులు