అనురాగ్ కాశ్యప్ పై కేసు నమోదు

లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ పై కేసు నమోదైంది. అనురాగ్ కశ్యప్, నటి పాయల్ ఘోష్ ల మధ్య జరుగుతున్న లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేసిన నటి పాయల్ ఘోష్ తాజాగా ఆయనపై అత్యాచారం కేసు పెట్టారు. బుధవారం వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్టు ఆమె తరపు న్యాయవాది నితిన్ సాత్పూట్ వెల్లడించారు.

అత్యాచారం, దురుద్దేశంతో మహిళను నిర్బంధించి వారి గౌరవానికి భంగం కలిగించడంపై ఐపీసీలోని 376(1), 354, 341, 342 సహా పలు సెక్షన్లపై ఎఫ్ఐఆర్ దాఖలైంది అని పాయల్ ఘోష్ తరపు న్యాయవాది ట్వీట్ చేశారు. అంతకు ముందు ప్రధాని నరేంద్రమోదీకి పాయల్ ఘోష్ ట్వీట్ చేసింది. తనను బలవంతం చేయబోయిన కశ్యప్ పై చర్యలు తీసుకోవాలంటూ ట్విటర్ లో కోరారు. ఇదిలా ఉంటే తనపై పాయల్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అనురాగ్ తెలిపారు. ఈ విషయంలో మౌనంగా ఉండాలని తన న్యాయవాది సలహా ఇచ్చినట్టు ఆయన ట్విటర్ లో తెలిపారు.