టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై కేసు నమోదు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చిక్కుల్లో పడ్డారు. మైనంపల్లిపై పోలీసు కేసు నమోదైంది. మల్కాజ్ గిరిలో బీజేపీ కార్యకర్తపై దాడి ఘటనలో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో 15 మంది టీఆర్ఎస్ కార్యకర్తలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అటు, తమ కార్యకర్తపై టీఆర్ఎస్ శ్రేణుల దాడికి నిరసనగా బీజేపీ నేడు బంద్ కు పిలుపునిచ్చింది.

కాగా, ఎమ్మెల్యే మైనంపల్లికి, బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కు మధ్య భరతమాత బొమ్మ విషయంలో వివాదం చెలరేగి, అది ఘర్షణకు దారితీసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో శ్రవణ్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయగా, శ్రవణ్ గాయపడ్డాడు. ప్రస్తుతం శ్రవణ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆసుపత్రికి వెళ్లి శ్రవణ్ ను పరామర్శించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రౌడీయిజం చేస్తున్నారని, ఎమ్మెల్యే కబ్జాలను బయటికి తీస్తామని హెచ్చరించారు.