CBSE టెన్త్ పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో వచ్చే నెలలో జరగాల్సిన సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. అయితే 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి.. పాఠశాలల మూసివేత నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మే 4 నుంచి జరిగే సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నాం. బోర్డు తయారుచేసే ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా ఆధారంగా పదో తరగతి ఫలితాలు ప్రకటిస్తాం. ఇక 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నాం. జూన్‌ 1న కరోనా పరిస్థితిని సమీక్షించిన అనంతరం 12వ తరగతి పరీక్షల తేదీలపై నిర్ణయం తీసుకుంటాం. పరీక్షలు ప్రారంభించడానికి 15 రోజుల ముందుగానే వివరాలను ప్రకటిస్తాం  అని కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

కరోనా విజృంభణ దృష్ట్యా వార్షిక పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయి పరీక్షలపై చర్చలు జరిపారు. విద్యార్థుల శ్రేయస్సే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ప్రధాని చెప్పినట్లు రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. అకడమిక్‌ ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని మోదీ సూచించినట్లు పేర్కొన్నారు.