చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానవీయంగా ఉందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో విమర్శించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న శ్రీ చంద్రబాబు గారి ఆరోగ్య స్థితిగతుల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఆయన వయసును దృష్టిలో ఉంచుకోవడంతోపాటు, ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ఈ అంశంలోనూ రాజకీయ కక్ష సాధింపు ధోరణి సరికాదు. శ్రీ చంద్రబాబు గారి కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ఆందోళన చెందితే ప్రభుత్వ సలహాదారులు, జైళ్ల శాఖ అధికారులు చేసిన వ్యాఖ్యలు…. ప్రభుత్వ వైఖరిని సూచిస్తున్నాయి. వైద్యుల నివేదికలను పట్టించుకోకపోవడం, శ్రీ చంద్రబాబు గారి విషయంలో ప్రభుత్వ వైఖరిపై న్యాయస్థానం జోక్యం చేసుకొని విచారణ చేపట్టాలి. ఆయన ఆరోగ్యం విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని జనసేనాని స్పష్టం చేశారు.