ఏపీ ప్రభుత్వంకు, టీటీడీకి చిరంజీవి విన్నపం

తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల ఘాట్ రోడ్లలో పలు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. తిరుపతిలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో సినీ నటుడు చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. కుండపోత వర్షాల కారణంగా స్థానికులు పడుతున్న ఇబ్బందులు కలచివేస్తున్నాయని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న వర్షాలతో భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు బాధిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీలు కలసికట్టుగా కృషి చేసి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయాలని చెప్పారు. అన్ని రాజకీయ పక్షాలు, అభిమాన సంఘాలు సైతం చేయూతనివ్వాలని కోరుతున్నానని తెలిపారు.