ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు

  • ఆదిత్య ఎల్ -1 నిర్దేశిత ప్రయోజనం సాధించాలి

చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ లాండర్ ను దించి ప్రజ్ఞాన్ రోవర్ ద్వారా చంద్రునిపై అనేక పరీక్షలను దిగ్విజయంగా నిర్వహిస్తున్న మన ఇస్రో శాస్త్రవేత్తలు మరో గొప్ప ప్రయోగానికి విజయవంతంగా శ్రీకారం చుట్టడం హర్షణీయమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. సూర్యునిపై అధ్యయనం జరపడానికి నిర్దేశించిన ఆదిత్య ఎల్ -1 అబ్సర్వేటరీని నేడు విజయవంతంగా ప్రయోగించిన సందర్భంగా శాస్త్రవేత్తలందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనల్లో మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు. అంతరిక్ష రంగాన భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడానికి ఇస్రో శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి ఎంత కొనియాడినా తక్కువే. శాస్త్రీయ విజ్ఞాన ఫలాలు మానవ కల్యాణానికి ఉపయోగపడే దిశగా కృషి చేస్తున్న కేంద్రంలోని బి.జె.పి. ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఆదిత్య ఎల్-1 ప్రయోగం నిర్దేశిత ప్రయోజనాన్ని సాధించడంలో సఫలీకృతం అవుతుందని నమ్ముతున్నాను. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని జనసేనాని పేర్కొన్నారు.