95 లక్షల రూపాయలవ్యయంతో అంతర్వేది రథం నిర్మాణం

తూర్పుగోదావరిజిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఫిబ్రవరిలోగా 95 లక్షల రూపాయలతో అంతర్వేది రథం నిర్మాణం జరిగే విధంగా ఆదేశాలు జారీ చేసిన్నట్లు తెలిపారు. మానవ తప్పిదమా, కావాలని ఎవరన్నా చేసిందా అనే దానిపై లోతైన విచారణ జరుగుతుందన్నారు. ఈ ఘటనపై ఆలయ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు వేశామని.. ఈవోని బదిలీ చేశామని.. అలాగే అంతర్వేదిలో సీసీ కెమెరా విభాగం చూసే ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. విజయవాడ దుర్గగుడిలో జరిగిన క్షుద్ర పూజలపై విచారణ చేయిస్తున్నామని, హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండ చూస్తామని, రాజకీయ కోణంలో కావాలని కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవాలు నమ్మవద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నామని మంత్రి విజ్ఞప్తి చేశారు. విజయవాడ దేవదాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీతో కలిసి ఆయన సోమవారం మాట్లాడారు.