హైదరాబాద్ జూపార్కులో సింహాలకు కరోనా లక్షణాలు!

కరోనా మహమ్మారి హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులోనూ కలకలం రేపుతోంది. హైదరాబాద్ జూ పార్కులో 8 సింహాలు కరోనా తరహా లక్షణాలతో బాధపడుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ సింహాల నుంచి నమూనాలు సేకరించిన అధికారులు, ఆ నమూనాలను సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ)కి పంపించారు. సింహాల కొవిడ్ పరీక్షల రిపోర్టులు ఇవాళ వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధికారులు ఈ నెల 2 నుంచే జూ పార్కును మూసివేశారు.