జనసేనానికి కరోనా.. ఫామ్‌హౌస్‌లో చికిత్స..

జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ కరోనా బారిన పడ్డారు. జనసేనానికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కావడంతో నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర,  బహిరంగసభలో పాల్గొని హైదరాబాద్ కు చేరుకున్న తరవాత నలతగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఫలితాలు నెగిటివ్ గా వచ్చాయి. అయినప్పటికీ డాక్టర్ల సూచన మేరకు తన వ్యవసాయక్షేత్రంలోనే క్వారంటైన్ కు వెళ్లారు. అయితే అప్పటి నుంచి కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. దీంతో మరోసారి కోవిడ్ పరీక్షలు జరపగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని జనసేన పార్టీ పేర్కొంది.

ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ళ సుమన్ హైదరాబాద్ కు వచ్చి  పవన్‌కు చికిత్స ప్రారంభించారు. అవసరమైన ఇతర పరీక్షలన్నీ చేయించారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటివైరల్ మందులతో చికిత్స చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా ఇస్తున్నారని జనసేన తన ప్రకటనలో పేర్కొంది. ఇక, చిరంజీవి, సురేఖ, రాంచరణ్‌, ఉపాసన ఎప్పటికప్పుడు పవన్ ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారని.. అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని.. అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వచ్చి పవన్ కల్యాణ్‌ను పరీక్షించింది.. జ్వరం, ఊపిరితిత్తుల్లోని నిమ్ము, ఒళ్లునొప్పులు తగ్గడానికి మందులు వాడుతున్నారు.. తన ఆరోగ్యం నిలకడగా ఉందని.. త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ తెలిపినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది జనసేన పార్టీ.