దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కరోనా పాజిటివ్!

దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కరోనా బారిన పడ్డారు. కొద్దిపాటి లక్షణాలతో తనకు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. తన నివాసంలో స్వీయనిర్బంధంలో ఉంటూనే.. దిల్లీలో పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు, యథావిధిగా తన బాధ్యతలు నిర్వహిస్తానని తెలిపారు.

”కొద్దిపాటి లక్షణాలతో నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. ఇటీవల నన్ను కలుసుకున్న వారంతా పరీక్షలు చేయించుకోవాలి. స్వీయ నిర్బంధంలో ఉంటూనే దిల్లీలో పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు యథాతథంగా విధులు నిర్వహిస్తాను” అని బైజల్‌ పేర్కొన్నారు. కాగా గత నెలలోనే బైజల్‌ తన సతీమణితో కలిసి కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు టీకా తీసుకున్నారు. కొవిడ్‌ పరిస్థితి సమీక్షల నేపథ్యంలో గత కొన్ని రోజుల్లో బైజల్‌ అనేక మంది అధికారులతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు.

అనిల్‌ బైజల్‌ త్వరగా కోలుకోవాలని.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆకాంక్షించారు.