తెలంగాణలో మందుల పంపిణీకి ప్రత్యేక కమిటీ

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు మందుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. నిమ్స్‌ డైరెక్టర్ మనోహర్‌, డీఎంఈ, డీహెచ్‌ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఓ వైపు వైరస్ ఉద్ధృతి.. మరోవైపు ప్రాణాధార మందుల కోసం మెడికల్ షాప్‌ల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొవిడ్ వైరస్‌ను నియంత్రించే టొసిలిజుమాబ్‌ ఇంజక్షన్లు బాధితులకు అందించేందుకు సర్కారు తాజాగా ఈ కమిటీని ఏర్పాటు చేసింది. అర్హులైన వారికి టొసిలిజుమాబ్‌ ఇంజక్షన్లు ఈ కమిటీ అందించనుంది. ఇందుకోసం ఆయా ఆస్పత్రులు డీఎంఈ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఒక్కో బాధితుడికి సంబంధించి ఆస్పత్రులు పంపిన వివరాలను పరిశీలించిన అనంతరం కమిటీ సభ్యులు బాధితులకు టొసిలిజుమాబ్‌ ఇంజక్షన్లను కేటాయించనున్నారు. ఫలితంగా బ్లాక్ మార్కెట్‌ని కట్టడి చేయటంతోపాటు అర్హులైన బాధితులు ఆస్పత్రులు, మెడికల్ షాప్స్ చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇంజక్షన్లు దొరకే అవకాశం ఏర్పడుతుంది.