మాజీ మహిళా క్రికెటర్ తల్లికి కరోనా.. ఆర్థికసాయం చేసిన విరాట్ కోహ్లీ

భారత మాజీ మహిళా క్రికెటర్ స్రవంతి నాయుడు తల్లి కరోనా బారినపడగా, టీమిండియా పురుషుల జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పెద్ద మనసుతో ఆర్థికసాయం అందించాడు. స్రవంతి నాయుడు తల్లి ఎస్కే సుమన్ ప్రస్తుతం హైదరాబాదులో కరోనా చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో సాయం చేయాలంటూ స్రవంతి బీసీసీఐ, హైదరాబాద్ క్రికెట్ సంఘంను కోరింది.

అయితే, స్రవంతి అభ్యర్థనను ఓ ట్వీట్ లో పేర్కొన్న బీసీసీఐ సౌత్ జోన్ మాజీ కన్వీనర్ ఎన్.విద్యాయాదవ్ (బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్ సోదరి) తన ట్వీట్ కు విరాట్ కోహ్లీని కూడా ట్యాగ్ చేశారు. దాంతో వెంటనే స్పందించిన కోహ్లీ… స్రవంతి నాయుడు తల్లి కోసం రూ.6.77 లక్షలు విరాళంగా అందించారు.

స్రవంతి తల్లిదండ్రులిద్దరూ కరోనా బారినపడగా, ఆమె ఇప్పటివరకు రూ.16 లక్షలు ఖర్చు చేసింది. అటు, హైదరాబాద్ క్రికెట్ సంఘం అపెక్స్ కౌన్సిల్ ఇప్పటికే స్రవంతి తల్లికి చికిత్స కోసం రూ.3 లక్షలు విడుదల చేసింది. త్వరలోనే మరో రూ.2 లక్షలు విడుదల చేయనుంది.