పని ప్రదేశాల్లోనే కరోనా వ్యాక్సిన్లు: కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో ఓవైపు కరోనా మళ్లీ చెలరేగిపోతుండగా, వీలైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పనిచేసే ప్రదేశాల్లో కూడా కరోనా వ్యాక్సిన్ డోసులు వేస్తారు. ఈ నెల 11 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ వ్యాక్సినేషన్ చేపట్టనున్నారు. అయితే, ఓ కార్యాలయంలో కరోనా వ్యాక్సిన్లు ఇవ్వాలంటే కనీసం 100 మంది సిద్ధంగా ఉండాలని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో 45 ఏళ్లకు పైబడినవారికి కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఈ నెలలో అనేక సెలవులు ఉన్నప్పటికీ, కరోనా టీకా డోసులను ప్రతిరోజు వేయాలని నిర్ణయించారు.