కరెంటు బిల్లులతో కూడా మోసం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే: కేతంరెడ్డి వినోద్ రెడ్డి

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 310వ రోజున 9వ డివిజన్ నవాబుపేట రామకృష్ణనగర్లో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్ళిన కేతంరెడ్డి ప్రజా సమస్యలను అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా తమవంతు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఏ ఇంటికి వెళ్ళినా వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన కరెంటు బిల్లుల గురించి ప్రజలు నివేదిస్తున్నారని అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా కరెంటు బిల్లులతో కూడా మోసం చేస్తున్న ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఉచితాల పేరుతో ప్రజా ఆస్తులను తాకట్టు పెట్టి, రాష్ట్రంలో మౌళిక సదుపాయాల అభివృద్ధి అనేదే లేకుండా చేయడమే కాక, పన్నుల పేరుతో బిల్లుల పేరుతో అడ్డగోలు దోపిడీకి ఈ ప్రభుత్వం పాల్పడుతోందని అన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ ప్రభుత్వాన్ని సాగనంపి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందామా అని ప్రజలందరూ వేచి చూస్తున్నారని, పవనన్న ప్రభుత్వంలో ఇలాంటి మోసాలకు తావే ఉండదని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.