గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాల్లో కోత

రెండేళ్ల సర్వీసు పూర్తవడంతో ప్రొబేషన్‌ ప్రకటన కోసం ఎదురు చూస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. బయోమెట్రిక్‌ హాజరు లేదని అక్టోబరు జీతంలో కొందరికి 10%, మరికొందరికి 50% వరకు తగ్గించారు. ఈ మేరకు సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 22 వరకు హాజరుకు సంబంధించిన డాటా జిల్లాలకు చేరింది. వీటి ఆధారంగానే ఉద్యోగులకు జీతాలను వేయాలని డ్రాయింగ్‌, డిజ్బర్స్‌మెంట్‌ అధికారుల(డీడీవో)ను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ (ఆర్‌సీ నంబరు: 1/ఏ/2021) ఆదేశించింది. అయితే… క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలను పరిష్కరించకుండా హాజరు లేదని జీతాల్లో కోత విధించడంపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఉద్యోగులు శనివారం మండల అధికారులకు వినతులు ఇచ్చారు. సాంకేతిక సమస్యలను సరిచేసి మరోసారి హాజరు, జీతాల డాటాను రూపొందించాలని కోరారు.