మీడియాతో పెట్టుకుంటే మీ గొయ్యి మీరే తొవ్వుకున్నట్లే

తిరుపతి సిటీ, రాప్తాడు సీఎం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు. సోమవారం తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసనలో తిరుపతి కెమెరామెన్ అసోసియేషన్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో కలిసి అన్ని రాజకీయ పార్టీల ప్రముఖు నేతలు పాల్గొని ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఈ దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దౌర్జన్యాలకు, దాస్టికాలకు పాల్పడుతున్న వ్యక్తులకు, సొంత పార్టీ నేతలకు పెద్దపీట వేసి మీడియాపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్నట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉందని, ఇలాంటి చర్యలను తక్షణమే మార్చుకోవాలని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి జగన్ మాట్లాడుతున్న సభలో విచ్చలవిడిగా ఫోటోగ్రాఫర్ పై దాడికి వైసిపి కార్యకర్తలు పాల్పడితే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అధికార పార్టీ అండతోనే వైసిపి లోని కొందరు రౌడీ మూకలు మీడియాపై దాడులు చేస్తూ, రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో పెట్టుకుంటే మీ గొయ్యి మీరే తోవ్వు కున్నట్లని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, అన్ని రాజకీయ పార్టీల ప్రముఖ నేతలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.