ఓయూలో కరోనా కలకలం.. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌..

ఉస్మానియా యూనివర్సిటీలో కరోనా కలకలం సృష్టించింది. గురువారం ఓయూలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఇద్దరు అమ్మాయిలకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో యూనివర్సిటీ ఒక్కసారి ఉలిక్కిపడింది. 150 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. అయితే ఈ అమ్మాయిలు ఇతర విద్యార్థులతో కలిసి భోజనం చేయడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.

ఇదిలా ఉంటే యూనివర్సిటీ పరిధిలో ఈ రోజు (శనివారం) నుంచి మూడో సెమిస్టర్‌ పరీక్షలు జరగనున్నాయి. దీంతో పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. పరీక్షలకు హాజరైతే కరోనా సోకే ప్రమాదం ఉంది కాబట్టి అందరికీ కరోనా టెస్టులు చేసిన తర్వాతే, ఎగ్జామ్స్ నిర్వహించాలని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ఉదయం అమ్మాయిలు డిమాండ్‌ చేశారు. ఇక విద్యార్థులు చేసిన ఈ డిమాండ్‌పై ఓయూ రిజిస్టర్‌ తాజాగా పత్రిక ప్రకటన విడుదల చేశారు. రేపటి నుంచి జరగనున్న పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థుల డిమాండ్‌ను ఆమోదించే పరిస్థితులు లేవని తెలిపారు. దీనికి కారణం సిద్ధిపేట, మెదక్‌, సంగారెడ్డి, వికారబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో జరగనున్న పరీక్షలకు సుమారు ఎనిమిది వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఇప్పటికప్పుడు పరీక్షలను వాయిదా వేయలేమని తెలిపారు. అయితే ఎవరైనా విద్యార్థులు కోవిడ్‌ 19 కారణంగా శనివారం జరగబోయే పరీక్షలకు హాజరు కానీ నేపథ్యంలో వారికి ఈ పరీక్షలను తర్వాత నిర్వహించనున్నామని తెలిపారు. ఇక ఈ పరీక్షలను సప్లిమెంటరీగా కాకుండా రెగ్యులర్‌ పరీక్షలలాగే పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు.