సరిహద్దు రక్షణలో ఎవరిపై ఆధారపడం: రాజ్నాథ్సింగ్
ఇప్పటివరకు సరిహద్దులను రక్షించేందుకు వివిధ దేశాల నుంచి విమానాలు, ఇతరత్రా యుద్ధ సామగ్రిని దిగుమతి చేసుకుంటుండగా.. ఇకపై ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడం అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. బెంగళూరులోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) లో రెండవ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఎల్సీఏ) ఉత్పత్తి శ్రేణిని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ ఒప్పందం ప్రకారం, తేజస్ ఎల్సీఏలను వైమానిక దళానికి అందజేయడం 2024 మార్చి నెలలో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఈ ఎల్ఏసీ తయారీ ప్రారంభోత్సవం మన దేశ స్వావలంబన ప్రతిజ్ఞను మరింత నెరవేరుస్తుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తి రంగంలో స్వయం సమృద్ధిగా ఉండాలని భారత్ కోరుకుంటున్నదని, ప్రపంచ దేశాలకు ఇది సందేశాన్ని చేరవేస్తుందని చెప్పారు.
“దేశ భద్రత కోసం ఇతర దేశాలపై మనం ఎక్కువ కాలం ఆధారపడలేం. మనకు మనంగా రక్షణ రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ మనకు కావాల్సిన ఆయుధ సంపత్తిని ఉత్పత్తి చేసుకోవాలి. ఇలాంటి పనులతో దేశీయ స్వావలంబన సాధ్యమవుతుంది” అని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సరిహద్దును కాపాడుకుంటూ మన ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. ఢిల్లీ నుంచి బెంగళూరు బయళ్దేరే ముందు.. హెచ్ఏఎల్ రెండవ ఎల్సీఏ ప్రొడక్షన్ లైన్ ప్రారంభోత్సవానికి బెంగళూరు వెళ్తున్నట్లు ట్విట్టర్లో రాశారు. అలాగే, రేపటి నుంచి జరుగనున్న ఏరో ఇండియా ప్రదర్శనకు కూడా హాజరవుతానని ట్వీట్లో పేర్కొన్నారు.