రైతులకు శివసేన సంఘీభావం

కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 69 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతులకు శివసేన సంఘీభావం తెలిపింది. ఆ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారంనాడు ఘాజీపూర్ (ఢిల్లీ-ఉత్తరప్రదేశ్) సరిహద్దులో ఆందోళనలు సాగిస్తున్న రైతులను కలుసుకున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయిత్‌ను కలుసుకుని తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఆయన వెంట పార్టీ ఎంపీ అరవింద్ సావంత్ కూడా ఉన్నారు. దీనికి ముందు, సంజయ్ రౌత్ ఒక ట్వీట్‌లో తాను ఘాజీపూర్ సరిహద్దుల్లో నిరసనలు సాగిస్తున్న రైతులను కలుసుకుని సంఘీభావం తెలియజేయనున్నట్టు పేర్కొన్నారు. రైతులను కలుసుకోవాలని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాకరే తనకు సూచించినట్టు తెలిపారు.