హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా విమాన సర్వీసులు

అమెరికాకు ఎయిర్‌ ఇండియా మరో విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురాబోతున్నది. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాకు నేరుగా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 15 నుంచి హైదరాబాద్ నుంచి చికాగోకు నేరుగా సర్వీసును ఎయిర్ ఇండియా నడపబోతుంది. బోయింగ్ 777-200 విమానాన్ని ఈ సర్వీసు కోసం వినియోగించనున్నారు. ఈ విమానం 238 (8 ఫస్ట్ క్లాస్+35 బిజినెస్ క్లాస్+195 ఎకానమీ క్లాస్) సీటింగ్ కెపాసిటీతో ఉంటుంది. ఏటా 2.2 లక్షలకు మందికిపైగా హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి అమెరికాకి వెళ్లేవారి కోసం ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి అమెరికాకు ఇతర ఎయిర్‌పోర్ట్‌ల కనెక్టింగ్‌తో సర్వీసులు ఉన్నాయి. నేరుగా నడపాలని పాసింజర్స్ ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తోన్న నేపథ్యంలో తాజాగా వారికి అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అమెరికా దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్ బ్యాకప్ మెకానిజంగా ఉన్న నేపథ్యంలో ఈ విమానానికి అపారమైన సామర్థ్యం ఉందని అధికారులు తెలిపారు. అదే విధంగా ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు చెందిన తెలుగు ప్రవాసులకు బాగా ఉపయోగపడనుందని పేర్కొన్నారు.