నాగబాబు పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన డా.పసుపులేటి హరిప్రసాద్

  • జనసేన బలోపేతం పార్టీ శ్రేణులతో మమేకం కానున్న నాగబాబు
  • జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

ఉమ్మడి చిత్తూరు జిల్లా, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనసైనికులను సన్నద్దం చేసే కార్యక్రమంలో భాగంగా ఈనెల 23, 24 తేదీల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తిరుపతిలో పర్యటిస్తున్నట్టు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 23న నాగబాబు తిరుపతికి చేరుకొంటారన్నారు. అదే రోజు తిరుపతిలోని నిశాల్ కన్వెన్షన్ లో తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు, జీడీ నెల్లూరు, చంద్రగిరి, మదనపల్లి నియోజకవర్గ పార్టీ నేతలు, జనసైనికులతో సమావేశమవుతారన్నారు. 24 తేదీన పూతలపట్టు, పలమనేరు, పుంగనూరు, కుప్పం, పీలేరు, తంబళ్లపల్లి, చిత్తూర నియోజకవర్గ నాయకులతో సమావేశమవుతారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తా చాటేలా జనసైనికులతో మమేకమవుతారని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలతో పవన్ కళ్యాణ్ భావజాలాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లేలా చర్చిస్తారని ఆ ప్రకటనలో ఆయన తెలిపారు. నాగబాబు పర్యటనను పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలని ఆయన కోరారు.