డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరం

భైంసా పట్టణంలోని ఎపి నగర్ కాలనీలో జనసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు మాట్లాడుతూ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతున్న పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరం. మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచిన డాక్టర్ ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక డాక్టర్ ప్రీతి బలవన్మరణానికి పాల్పడ్డ పరిస్థితులు, కన్న వారి మానసిక వేదన గురించి తెలుసుకొంటే హృదయం ద్రవించింది. తమ బిడ్డను సైఫ్ వేధిస్తూ, కించపరుస్తూ ఉన్నాడని తల్లితండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే కాలేజీ బాధ్యులు సరైన రీతిలో స్పందించి ఉంటే ఇటువంటి దురదృష్టకర పరిస్థితి వచ్చేది కాదు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలి. కళాశాలలో ముఖ్యంగా మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్, వేదింపులు అరికట్టడంపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించాలి. సీనియర్ విద్యార్థుల ఆలోచన ధోరణి మారాలి. కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టిన వారిని స్నేహపూర్వకంగా అక్కున చేర్చుకుని తమ కుటుంబ సభ్యుల్లా ఆదరించాలి. అందుకు భిన్నంగా వేధింపులకు పాల్పడటం, ఆధిపత్య ధోరణి చూపడం రాక్షసత్వం అవుతుందని గ్రహించాలి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అర్జున్, ఆనంద్, మహేష్, మారుతి, యోగేష్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.