సీఎంఆర్‌ఎఫ్‌కు డాక్టర్‌ రెడ్డీస్‌ రూ. 5 కోట్ల విరాళం

గత నెలలో హైదరాబాద్‌ నగరంలో గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ వానలు నగరాన్ని అతలాకుతలం చేశాయి. పలువురు మృతిచెందగా, లోతట్టు ప్రాంతాల్లోని అనేక కుటుంబాలు నిరాశ్రయం చెందాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి సంబంధించి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ ఆపత్కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీ లిమిటెడ్‌ తన వంతు సహాయాన్ని అందిస్తున్నట్లు ఆ సంస్థ కార్పొరేట్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి. విశ్వనాథ్‌ తెలిపారు. ఈ మేరకు రూ. 5 కోట్ల విలువైన చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. ఈ కష్ట కాలంలో మీ నాయకత్వం, సమయానుకూల సహాయక చర్యలపట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.