అసోంలో భూకంపం… సీఎం సోనోవాల్ తో మాట్లాడిన ప్రధాని మోదీ

ఈశాన్య రాష్ట్రాలు ఈ ఉదయం భూప్రకంపనలతో ఉలిక్కిపడ్డాయి. ప్రధానంగా అసోంలో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి అనేక భవనాలకు నష్టం వాటిల్లింది. అయితే ఎక్కడా ప్రాణాపాయం జరిగినట్టు గానీ, గాయాలపాలైనట్టు గానీ సమాచారం లేదు. తొలుత భారీ శబ్దంతో ప్రకంపనలు వచ్చిన పిదప… 4.1, 4.4 తీవ్రతతో మరో రెండు భూకంపాలు సంభవించాయి. తేజ్ పూర్ కు నైరుతి దిశగా 30 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు.

కాగా, ఈ భూకంపం ధాటికి పొరుగునే ఉన్న బెంగాల్ ఉత్తరభాగంలోనూ ప్రకంపనలు వచ్చాయి. కూచ్ బెహార్, మాల్డా, జల్పాయ్ గురి, సిలిగురి, ముర్షీదాబాద్, అలిపుదూర్ ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

అసోంలో భూకంపంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. వెంటనే అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ తో మాట్లాడారు. రాష్ట్రంలో భూకంపం సంభవించడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అన్నిరకాల సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అసోం ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు మోదీ ట్విట్టర్ లో తెలిపారు.